Saturday, August 31, 2013

జగదేకవీరుడి మాయలో అతిలోక సుందరి!!



1961లో వచ్చిన జగదేకవీరుని కథ జానపద సినిమాలలో ఓ క్లాసిక్.

ఉదయగిరి రాజ్యాన్నేలే రాజుగారికి ఇద్దరు కొడుకులు. మనిషి కనే కలల వల్లే వారి వ్యక్తిత్వం అభివ్యక్తం అవుతుందని రాజుగారి అభిప్రాయం. ఈ మేరకు ఓనాడు తన కొడుకులిద్దరినీ పిలిచి వారికి ఆ చక్కని వేళ తమ కోరికలేమిటో  చెప్పమంటాడు. 

ప్రతాప్ - చలువరాతి మేడలో తూగుటుయ్యాల ఊగుతూ ఐదుగురు దేవకన్యలను వివాహం చేసుకుని సుఖంగా ఉండాలనే తన కోరిక వ్యక్తపరుస్తాడు. రాజుగారికి ఇలాంటి తీరని కోరికలు కోరడం అసంబద్ధమయిన కోరికగా అనిపించి కొడుకుతో వాదించి గెలవలేక ఆ కోరిక నెరవేర్చుకుని రమ్మని  దేశ బహిష్కరణ శిక్ష వేస్తాడు.  రాజ్యాలన్నీ చూస్తూ ఇంద్రకుమారి ఇంద్రజతో శాపం పొంది శిలగా మారినా తిరిగి పార్వతీదేవి సహాయంతో మనిషౌతాడు.ఇంద్రకుమారి   తప్పనిసరి పరిస్థితిలో ప్రతాప్ ని పెళ్ళిచేసుకుంటుంది. 

 తన దైవత్వాన్ని పోగొట్టుకోవలసిన పరిస్థితి వచ్చినందుకు బాధ, అమరలోకంలో ఉండవలసిన తనను ప్రేమతో మాయ చేసి భూలోకంలో ఉంచేసిన ప్రతాప్ పట్ల కొంత కినుక ఉన్నా అతని పట్ల ఆమెకి గల మమత,  ఆకర్షణ , ప్రేమ తక్కువైనది కాదు.  ఈ అతిలోక సుందరితో ఆ జగదేకవీరుడికి పరిణయం జరిగిన తర్వాత వారిమధ్య అనురాగాన్ని వివరించే సందర్భమే ఈ పాట. 

 మనోహరముగా మధుర మధురముగ మనసులు కలిసెనులే”.

విజయవారి సినిమాల్లో విరిసే వెన్నెల నేపథ్యం ఈ పాటకి కూడా చక్కగా అమరింది. చల్లని వెన్నెలవేళ దేవకన్యలతో సేవలందుకుంటూ సౌఖ్యమందాలనే ప్రతాప్ కోరికకి తొలిమెట్టు ఇంద్రకుమారితో సహజీవనం. ఆ కోరికకి తగినట్టు ఆనాటి వెన్నెలరేయి ఈ పాటకి నేపథ్యం. అంత చల్లని చందమామ కాంతిలో, మనసుకు ఉల్లాసం కలిగించే మందపవనుడి మలయానిలం వీవనగావీయగా  మురిసిపోతున్న మనసులతో ఉన్నారు ప్రతాప్, ఇంద్రకుమారి.

మనోహరముగా మధుర మధురముగ మనసులు కలిసెనులే...మమతలు విరిసెనులే  అంటూతమ మధ్య అనురాగం ఎంతో మధురంగా పండిందని. కలిసిన మనసులతో తమ దాంపత్యం ఎంతో చక్కగా సాగుతుందని ఊహిస్తూ ఉన్నాడు ప్రతాప్. తమ మధ్య ఈ  అద్భుతమైన ప్రేమానుభూతి నిండడానికి కారణం ఆ వెన్నెల వెదజల్లే చందమామ అంటూ అతని వెన్నెల చేస్తున్న మాయాజాలం, ఆ చందమామ మహిమ వల్లే తమలోని ప్రణయభావనలు ఇనుమడిస్తున్నాయని భావిస్తాడు ప్రతాప్.  అది అంతే, ఆ చందమామ అలా కాంతులు చిందిస్తూ ఉన్నంతసేపూ తమ ప్రేమానుభూతి మరింత ఇనుమడిస్తూనే ఉంటుందంటాడు. సరేలే.. మనకిది మంచిదిలే అని.

మంచిది అయినా కొంచమైనా వంచన నీదేలే..ఐనా మంచిదిలే

ఇంద్రకుమారి కి వెన్నెల కాంతితో ఆ చందమామ చేస్తున్న మహిమలు తమలో ప్రేమభావాన్ని మరింతగా పెంచుతున్నాయని అర్థం అయింది. కానీ ఆమెకి ఆకాశంలో కనిపించే ఆ  చందమామలాంటి చక్కనైన మనోహరుడు తన భర్తని ఆ స్థానంలో ఊహించింది. తనని ప్రేమించానంటూ వెంటపడి తనని జగన్మోహనమైన రూపంతో ఆకర్షించి, పార్వతీమాత సహకారంతో తనని వంచన చేసి పెళ్ళి చేసుకున్న ప్రతాప్ ఆ చందమామలాగే మాయలు చేసాడు అంటుంది. అతను చేసిన ఆ మోసం చిన్నదే...కొంచెమే కావచ్చు కానీ అది వంచనే కదా. తనని పెళ్ళి చేసుకోవడం కోసం మోసం చేసాడు కదా.  అయినా అతను చేసిన ఆ వంచన వల్ల తనకి ప్రేమించే ఓ హృదయం దొరికినందుకు అది మంచే  చేసింది కదా అని సమాధాన పడుతుంది.
ఇది మోహన మంత్రమెలే – అదంతేలే- సరేలే- మనకిది మేలేలేఅంటూ ఆ ప్రకృతి మాయాజాలం మంత్రాలువేస్తూ తమని  ప్రేమ ముగ్గులోకి దింపుతున్న వైనాన్ని గమనిస్తాడు ప్రతాప్. అయినా ప్రేమికులకు కావలసిన వాతావరణాన్ని ఆ ప్రకృతి కల్పిస్తూ ఇలా తమని అందులో లీనం చేస్తూఉంటే  సరేలే , అది మంచిదే కదా అనుకుంటాడు. 

ప్రతాప్ ఈ రమ్యమైన ప్రకృతికి పరవశించి ఆ మంత్ర మహిమకు ముగ్ధుడైతే ఇంద్రకుమారికి, తన మీద ఆ మానవవీరుడు ప్రతాప్ చేస్తున్న మాయాజాలానికి ఆశ్చర్యం కలుగుతోంది. ఇంత దేవకన్యనైన తనను మాలిమి చేసుకున్నాడు. అతిలోక సుందరి అయిన తనకే సౌందర్యం అనే  జాలము(వల)వేసి వశపరుచుకున్న అతని చమత్కారానికి పరవశించింది. ఈ విధంగా తను అతనికి వశం కావడం వలన తన దైవత్వం పోయింది. మానవ లోకంలో ఓ సామాన్య స్త్రీగా మారవలసి వస్తోంది. అందుకు కొద్దిగా విచారం ఉన్నా అంతగా తనను ప్రేమించే ఆ ప్రతాప్ లాంటి ప్రేమికుడికి అర్థాంగి కావడం తనకి మేలు అని భావిస్తుంది. అందుకే మేలి ఐనా మాలిమైనా జాలము నీదేలే ఐనా మేలేలే – అంటూ అతని మోసానికి కారణం అతనికి తనపై గల అంతులేని మమకారమే కదా అని సర్దుకుపోతుంది. తమలో మమతలు కురిసి, మనోహరమైన మధురానందాలు విరిసే వెన్నెలరేయిలో ప్రతాప్ ప్రేమలో మురిసిపోతుంది ఇంద్రకుమారి.

తల్లి దీవెనతో జగన్మాత ఆశీస్సులతో చిన్నపాటి మోసం చేసి ఇంద్రకుమారిని వశపరచుకుంటాడు ప్రతాప్. అతనిది మోసం అని తెలిసినా అతని పట్ల గల ఆకర్షణ, అతని ప్రేమలోని అయస్కాంతబలం వైపు ఆకర్షించబడిన ఇంద్రకుమారి అతని ప్రేమకి బందీ అవుతుంది. అతని భార్యగా భూలోకానికి కాపురమొస్తుంది. ఈ పాటలో ఆ విషయాలన్నీ ఎంతో చక్కగా ఆవిష్కరించబడ్డాయి. అదంతేలే, సరేలే, మనకి మంచిదేలే వంటి పద చమత్కారంతో పింగళి లేఖిని శ్రోతలను గిలిగింతలు పెడుతుంది.  మనకది మంచిదిలే అని ప్రతాప్ తో అనిపించినప్పుడు ఒక భావాన్ని, వంచన నీదేలే అయినా మంచిదిలే అని ఇంద్రకుమారితో అనిపించినప్పుడు ఒక భావాన్ని ఎంతో చమత్కారంగా చూపించారు పింగళి. 

ప్రకృతి తమను మాయచేస్తోందని కానీ ప్ర్రేమికులకు అది మంచిదే కదా అని ప్రతాప్ తో అనిపిస్తారు. ఇంద్రకుమారి  తిరిగి ఆ పదాలనే వాడి - ఆ మాయలన్నీ ప్రతాప్ వనీ,తాను ఆతని మాయలో పడ్డానని అనుకుంటూనే  అయినా మంచిదేలే అనుకుంటూ అతనికి తనని తాను అర్పించుకుని అతనితో  సహజీవనానికి సిద్ధపడుతుంది ఇంద్రకుమారి.

విజయావారి చల్లని వెన్నెలరేయిలో , ఎద  ఝల్లనిపించే   నేపథ్యగానంతో  అతి చక్కగా చిత్రించబడిన కమ్మని గీతం ఈ గీతం.   
గీతరచన పింగళి నాగేంద్రరావుగారు. 
పెండ్యాల నాగేశ్వరరావుగారు స్వరకర్త. 
ఘంటసాల, సుశీల ఈ పాటని ఆలపించారు.  


పాట సాహిత్యం::

అతను          మనోహరముగా మధుర మధురముగ
                 మనసులు కలిసెనులే 
                 ఆ....ఆ....మమతలు విరిసెనులే 

ఆమె            మనోహరముగా మధురమధురముగ
                 మనసులు కలిసెనులే....
                 ఆ....ఆ...మమతలు విరిసెనులే

అతను          ఇది చంద్రుని మహిమేలే అదంతేలే సరేలే
      
                  సరేలే...మనకిది మంచిదిలే

ఆమె            ఆ...మంచిది అయినా కొంచెమే అయినా
                  వంచన నీదేలే....
                 ఆ...ఆ...అయినా మంచిదిలే                             "మనోహరముగా"

అతను          ఇది మోహన మంత్రమెలే...అదంతేలే
                  సరేలే...మనకిది మేలేలే.

ఆమె            ఆ....మేలే అయినా మాలిమైనా జాలము నీదేలే
                 అయినా మేలేలే....................................  " మనోహరముగా"







Thursday, August 22, 2013

తేట తెలుగు మాటల ఊట - మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి పాట!!

తేట తెలుగు మాటల ఊట - మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి పాట!!

ఇప్పటి  నిత్య వ్యవహారంలో మాయం అయిపోయిన ఆనాటి  తెలుగు మాటలు మళ్ళీ వినాలంటే మల్లాది రామకృష్ణశాస్త్రిగారి  సాహిత్యం చదివి తీరాల్సిందే. ఎన్నో కథలు, రూపకాలు, నవలలు రాసారు ఆయన . ఎన్నో సినిమాలకు  పాటలు రాసారు.
సుకుమారమైన సరళమైన చక్కని తెలుగు  మాటలతో వినిపించే ఆ కమ్మనైన పాటల్లో  "చిరంజీవులు" సినిమా లోని ఈ "చిక్కిలింత చిగురు సంపంగి గుబురు" పాట ఒకటి.
పాటలో  మాటల అల్లికలో తొంగి చూసే యవ్వనపు జిగి బిగి, అనురాగాల కొసరింపులు, పదాల చమత్కారాలు మైమరిపిస్తాయి. మాటకి కూడా  వాసన ఉండడం అంటే ఏమిటో అనుభవానికి వస్తుంది ఆ మాటల ఘుమ ఘుమని అనుభవిస్తూ ఉంటే.
చిన్నతనం నుంచి కలిసి పెరిగిన పిల్లలు  నాయికా నాయికలు. స్నేహబంధం ప్రణయ బంధంగా రూపు దిద్దుకుంది.  ఓ చల్లని సాయం సమయంలో ఎడ్లబండి మీద షికారు చేస్తూ ఒకరి మీద ఒకరికి ఇనుమడించిన వలపును చిలిపి సరసాలతో సంతోషాలతో  ఉల్లాసంగా తెలుపుకోవడం  ఈ పాటకి సందర్భం.

చిక్కిలింత చిగురు సంపంగి గుబురు-చినదానీ మనసు
చినదాని మీద మనసు.............
అంటాడు ఆ చినవాడు. తాను ప్రేమించిన ఆ చిన్నదాని మనసు చిక్కిలింత చిగురు లా లేతనైనది, అతి సున్నితమైనది, సంపంగి గుబురులా గుబాళిస్తూ ఉన్నది. అటువంటి చినదాని మనసు మీద తనకు మనసయిందట. చిన్నదాని మనసు, చినదాని మీద మనసు రెండు అక్షరాలు మీద అని మాత్రం చేర్చి రెండు విభిన్న భావాలను వ్యక్తం చేస్తారు కవి.

అబ్బాయి మనసు తెలుసుకున్న చిన్నది తనకు అతని మీద ఉన్న మక్కువను ఎలా చెబుతోందో చూడండి.
మనసైన చినదానికి, అందానికి -
కనుసైగ మీద మనసు కనుసైగ మీద మనసు

చిన్నవాడు మనసు పడిన ఆ చిన్నదానికి, ఆ అందమైనదానికి చిలిపిగా ఆమె కోసం చేసే అతను చేసే  కనుసైగల మీదే మనసయిందట. తన కోసం ప్రియుడు ఆరాట పడుతూ, కను సైగలతో తనను పిలుస్తూ, ప్రేమని కొసరే క్షణాలకోసం ఆమె ఎదురు చూస్తుంది. ఆ విషయాన్ని ఎంత అందమైన వాక్యాలతో చెప్పిందో.

ఇక  ఆ చిన్నవాడికి ఆమె అందాన్ని మెచ్చుకోబుద్ధయింది.
చెంపకు చారెడేసి కన్నులున్న చిన్నది, చిన్నదాని సిగలో రేకులెన్నో
గువ్వకన్ను రైకమీద చుక్కలెన్నో.....

అమ్మాయి కళ్ళు చెంపకు చారెడేసి ఉంటే ఎంత అందమో చెప్పనక్కర్లేదు. ఆమె సిగలో పెట్టుకున్న మొగలి రేకులు అతన్ని మత్తుకొలుపుతున్నాయి. ఆమె వేసుకున్న గువ్వకన్ను రవిక మీద ఉన్న చుక్కలు ఎన్నో అడుగుతున్నాడు. గువ్వకన్ను రవిక అనేది కృష్ణాజిల్లాకు  సంబంధించిన ఒక వస్త్ర విశేషం అట. చిన్న చిన్న చుక్కలు అద్దిన రవిక ను గువ్వకన్ను రవిక అనేవారట.అలా రవికను వర్ణిస్తున్నాండంటే అతను ఆ గువ్వకన్ను రవికమీద చుక్కులను లెక్కపెట్టే సాకు మీద ఆమె ఒంపు సొంపులను గమనిస్తున్నాడని కవిగారు చిలిపిగా చెప్పక నే   చెప్పిన మాట. మల్లాది వారు ఇలా  కృష్ణా జిల్లా ప్రయోగాన్ని  ఇక్కడ అందంగా వేసినట్టున్నారు. ఆమె అందాన్ని వర్ణించడం అయింది.

అతను రేకలెన్నో, చుక్కలెన్నో అంటూ కవ్విస్తూ ఉంటే ఆమెకీ చిలిపిగా జవాబు చెప్పబుద్ధి అయింది.

 ఎన్నుకో........ వన్నెలెన్నుకో......చిన్నెలెన్నుకో
వన్నెచిన్నెలెన్నుకో - ఎన్నికైన చిన్నవాడా.... అంటుంది.

ఎన్ని కో - లను ఎన్నిసార్లు  ఎంత అందంగా ప్రయోగించారో చూడండి.
ముందు ఎన్నుకో....అంటే లెక్క పెట్టుకో అనే అర్థంలో. సిగలో రేకులెన్ని, రైకమీద చుక్కలెన్ని అని అడుగుతున్నందుకు అంటోంది లెక్కపెట్టుకోమని. అలాగే తనను ఎన్నుకో అనే అర్థం కూడా ఇందులో ఉంది.
వన్నెలెన్నుకో...తన చక్కదనంలో వెల్లివిరుస్తున్న అనేక వర్ణాలను - వన్నెలను  లెక్కపెట్టుకోమంటుంది.
చిన్నెలెందుకో.....తన భావాలలో మారుతూ ఉండే ఆ కళలన్నీ లెక్కపెట్టుకోమంటోంది.
వన్నెచిన్నెలేలుకో అంటూ తన సోయగంలోని వన్నెలను చిన్నెలను ఏలుకోమని, స్వంతం చేసుకోమని - అంటూ
ఎన్నికయిన చిన్నవాడా అంటూ తన ప్రియుడిని సంబోధిస్తుంది.

చల్లని పైరుగాలిలో షికారు చేస్తూ పరవశించే మనసుతో  పడుచువాళ్ళు పాడుకుంటున్న పాట ఇది.  కనుకనే -
పైరుగాలి  ఘుమ ఘుమలో -  చెంగావి చెంగు రిమరిమలో 
పండిన పంటచేల పైనుంచి, చుట్టూ ఆవరించిన చెట్టూ- చేమ, తోటా అన్నింటిపైనుంచి వీచుతూ, అనేక రకాల పరిమళాలను మోసుకొచ్చే ఆ  పైరుగాలి ఎంత ఘుమఘమను పంచుతోందో. మనసును ఉల్లాసపరుస్తోందో.
అమ్మాయి కట్టుకున్న చెంగావి రంగు చీర రిమరిమ సవ్వడి చేస్తూ పైరుగాలికి  విసిరికొడుతూ ఉంటే అమ్మాయి చెంగు ఆ గాలికి అలా అలా తేలిపోతూ అబ్బాయికి చక్కిలిగింతలు పెడుతుంది.  ఇంత చక్కని వాతావరణంలో ఈ అందమైన పడుచు తన  అందాన్ని అన్ని రకాలుగా చూసి తనను ఎన్నుకోమంటుంది.
తాను ఎన్నుకున్నవాడు తనకి నచ్చినవాడు చక్కనివాడు ఇలా ఇన్ని అర్థాలతో ఆ ఎన్నికైన చిన్నవాడా అంటూ ప్రియుడికి తన సౌందర్యంలోని అన్ని కళలను జాగ్రత్తగా గమనించి స్వంతం చేసుకోమని తన వలపును తెలుపుకుంటుంది.

దిరిసెన పూవుమీద చిలుకు ముగ్గులూ
చిన్నారి బుగ్గమీద   చిలిపి సిగ్గులూ......

అంటూ ఆమె సౌందర్యంలోని నాజూకుతనాన్ని  మెచ్చుకుంటాడు అతను.
దిరిసెన పూవు అంటే చాలా సుకుమారమైన పువ్వు. తెలుపు, పసుపు వర్ణాల మిశ్రమంతో ఎంతో నాజూకుగా నవకాలొలికే పుష్పం. తన ప్రేయసి ముఖ సౌందర్యాన్ని ఆ దిరిసెనపూవు సౌకుమార్యంతో పోల్చి ఆమె బుగ్గలో తొణికిసలాడే సిగ్గులను ఆ  దిరిసెన పూవుమీద కనిపించే వర్ణాల కలబోతతో  తూకం వేస్తూ  ఆ అందాలను చూసి మురిసిపోతాడు.  పసుపు, తెలుపు కలిసిన  మోము పైన సిగ్గులు కమ్మి అవి బుగ్గలపై ముగ్గులు వేస్తూ ఉంటే చూడడానికి మరు మల్లెల దొంతర అమర్చినట్టు  ఎంతో  అందంగా ఉందనుకుంటాడు. మల్లె లలో     రెండు మూడు వరుసల రేకులతో ఉండే మల్లెలను మరు మల్లెలు అంటారేమో. అంటే ఎంత గుత్తిగా ఉంటే అంత అందం, అంతకు రెట్టింపు పరిమళం  కదా. ఆ మరుమల్లెలను దొంతులుగా పేర్చినట్టు ఆమె అందం చూడడానికి, అనుభవానికి కూడా పరిమళ భరితమైనదిగా ఉందని అబ్బాయి అంటాడు.

మనసే మరు మల్లెల దొంతర - మన  ఊసే విరజాజుల దొంతర
పాల వెన్నెలలు -  మురిపాల వెన్నెలలూ

అబ్బాయి, ఆమె సౌందర్యంలో వెల్లి విరుస్తున్న  మల్లెల పరిమళాన్ని, సోయగాన్ని  ఆస్వాదిస్తూ ఉంటే అమ్మాయి అతనితో తన స్నేహాన్ని, తమ మనసులో  వెల్లివిరిసే సంతోషాన్ని మల్లెల పరిమళంతో పోల్చుతూ మురిసిపోతుంది. తమ మధ్య అల్లుకున్న ఈ   బంధం లో  మరుమల్లెల దొంతరలోని పరిమళంతో పాటు, విరజాజుల్లోని సౌకుమార్యం కూడా ఇమిడిపోయి ఉండడాన్ని చూసింది. పాల వెన్నెల కాంతులలో  మురిపాల వెన్నెలలు  పంచుకునే  ఆ అపురూప దృశ్యాలన్నీ ఆమె కళ్ళలో కదులుతున్నాయి కాబోలు.

ఇద్దరు పడుచు పిల్లలు,  చిలిపితనంతో చిందులుతొక్కుతూ మనసులోని భావాలను  కలబోసుకునే సందర్భాన్ని మల్లాది రామకృష్ణశాస్త్రిగారు ఎంత అందమైన పొందికైన ఎన్నికైన ముచ్చటైన తెలుగు మాటల్లో పొదిగారో.

సాధారణంగా పాట అంటే పల్లవి చరణాలు ప్రతి చరణం చివర పల్లవిని తిరిగి ఆలపించడం మనం చూస్తాం. కానీ ఈ పాటని స్వరపరచినప్పుడు ఘంటసాలగారు  పాట ప్రారంభంలో  కనిపించే ఆ పల్లవిని తిరిగి పాటని ముగించడంలో మాత్రం వాడారు. చరణాల మధ్య పల్లవి వినిపించదు. ఇదో చమత్కారం ఈ పాటలో.

మల్లాది రామకృష్ణశాస్త్రిగారి  సాహిత్యాన్ని వివరించబూనడం, వ్యాఖ్యానించబోవడం  అతి సాహసమే కానీ ఇంత చక్కని యుగళగీతాన్ని పరిచయం చేయకుండా నిభాయించుకోలేని ఓ నిస్సహాయత. ఆ మాటల పరిమళాలను మురిపెంగా మనసారా మీరూ ఆస్వాదించండి మరి.
 వీడియోను యూట్యూబ్ లో వీక్షించవచ్చు....
http://www.youtube.com/watch?v=QZ39yXIWB6Y


చిత్రం           చిరంజీవులు
గానం          ఘంటసాల, లీల.
సంగీతం        ఘంటసాల
గీత రచన       మల్లాది రామకృష్ణ శాస్త్రి

పాట సాహిత్యం
                                         చిరంజీవులు
గీత రచన       మల్లాది రామకృష్ణ శాస్త్రి     సంగీతం  ఘంటసాల వేంకటేశ్వరరావు
ఆలాపన        సుశీల, ఘంటసాల
అతను          చిక్కిలింత చిగురు సంపంగి గుబురు
                  చిన్నదాని మనసు – చినదాని మీద మనసు
ఆమె            మనసైన చినదానికి అందానికి
                    కనుసైగ మీద మనసు                                   
అతను            చెంపకు చారెడేసి కన్నులున్న చిన్నది
                    చిన్నదాని సిగలో రేకలెన్నో గువ్వకన్ను రైకమీద చుక్కలెన్నో
ఆమె             ఎన్నుకో వన్నెలెన్నుకో చిన్నెలెన్నుకో
                   వన్నెచిన్నెలెన్నుకో ఎన్నికైన చిన్నవాడా       
                     పైరు గాలి ఘుమ ఘుమలో చెంగావి చెంగు రిమరిమలో        
అతను              దిరిసెన పూవుమీద చిలుకు ముగ్గులూ
                     చిన్నారి బుగ్గమీద   చిలిపి సిగ్గులూ...... 
                    మల్లెల దొంతరలూ మరు మల్లె దొంతరలూ
ఆమె               మనసే మరుమల్లెల దొంతర
అతను             మన వూసే విరజాజి దొంతర
ఆమె                ఆహా
ఆమె                పాల వెన్నెలలు

అతను              మురిపాల వెన్నెలలూ