Tuesday, December 27, 2011

చందమామ సావిత్రికి ఓ నూలుపోగు!!

            
 మహానటి సావిత్రి దివ్యస్మృతికి అంకితంగా మహాకవి రాసిన యుగళగీతం-

"వాడిన పూలే వికసించెనే"
మహాకవి శ్రీశ్రీ  సినీగేయాలలో ఓ మణిపూస!!
చావుబతుకులమధ్య ఉన్న  కూతురు కోరిక మేరకు ఓ  అమ్మమ్మగారు కొడుకు కూతురుకి , కూతురు కొడుక్కి పెళ్ళి చేస్తుంది. చాలా చిన్నపిల్ల అవడం వల్ల ఆ పాపకి తనకి ఆ పెళ్ళి జరిగిన గుర్తు కూడా ఉండదు. పెద్దవాళ్ళయ్యాక తెలియకుండానే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. మళ్ళీ ఎన్నో అపార్థాలు, పరిస్థితులు ప్రభావం వలన విడిపోవడం జరిగినా ఓరోజు నిజం తెలిసి తను చిన్నప్పుడు తనను పెళ్ళాడిన ఆ బావే, ఇప్పుడు తను ప్రేమించిన ఈ ప్రియుడు అని కథానాయిక  తెలుసుకుని చాలా సంతోషంగా ఉంటుంది.
పాట నేపథ్యం ఇది. ఈ సందర్భానికి  శ్రీశ్రీ గారు రాసిన గేయం ఇది.
వాడిన పూలే వికసించెనే
చెర  వీడిన హృదయాలు పులకించెనే
 కథానాయిక నాయకుడిని ప్రాణ ప్రదంగా ప్రేమించింది. కానీ తనకు చిన్నతనంలోనే వివాహం జరిగిందని తెలిసి హతాశురాలవుతుంది. మరొకరి సొత్తు అయిన తాను తిరిగి అతనిని ఎలా వరించగలదనే ప్రశ్నకు సమాధానం దొరకక ఎంతో మథన పడుతుంది. కానీ ఆ ప్రియుడే చిన్ననాడు తన మెడలో మాంగల్యం ముడివేసినవాడని తెలియగానే ఆమె సంబరం ఆకాశాన్నంటింది. అందుకే అంతవరకు ఆమెలో  పూవుల్లా విరిసి నిరాశలో ముడుచుకుపోయి వాడిపోయిన ఆశలన్నీ తిరిగి వికసించాయి.

వాడిపోయిన తర్వాత పూలు వికసించడం అనేది జరిగే పని కాదు. అది అసాధ్యం. కానీ అటువంటి అసాధ్యం అనుకునే పని ఈ రోజు తన విషయంలో జరిగినందుకు ఆమె ఆశ్చర్యంతో ఇలా అనుకోవడం  పాటకు సందర్భానికి సార్థకమైన ప్రారంభం. పరిస్థితులు తమ చుట్టూ విషమంగా అల్లుకుపోయి బంధం వేయడం వలన ఆ చెరలో ఉండి ఒకరినొకరు చేరుకోలేకపోయారు. ఇప్పుడు ఆ చెర వీడిపోయింది. అందుకే వారి హృదయాలు పులకిస్తున్నాయి.


ఆమె తన మరదలు అని అతనికి ఆమెకంటే ముందే తెలుసు. తన భార్యఅని తెలిసే ఆమెని చేరుకున్నాడు. కానీ కొన్ని పరిస్థితుల వలన ఆమెకు ముందు చెప్పలేకపోయాడు. ఎలాగో ఆమెకు నిజం తెలిసింది. ఇక ఆమెకు దూరంగా ఉండవలసిన అవసరం లేదు. అందువల్ల అతను ఆమెకోసం కన్న   తీయని  కలలన్నీ ఫలించబోయే తరుణం వచ్చిందని అనుకున్నాడు.


వసంత ఋతువు రావడానికి ముందు ఆకులన్నీ రాలిపోతాయి. చెట్లన్నీ మోడయిపోతాయి. కానీ కాలం అక్కడ ఆగిపోదు. నిర్జీవంగా ఉన్న ప్రకృతికి జీవం వస్తుంది. చెట్లన్నీ కొత్త చిగుళ్ళు తొడుక్కుంటాయి. ఈ మార్పులన్నీ చూసి అన్నాళ్ళూ ఎక్కడో నిద్రాణంగా ఉన్న కల కోకిల  మత్తుగా గమ్మత్తుగా నిద్ర లేస్తుంది. అత్యంత శ్రావ్యమైన తన  స్వరాన్ని సవరించుకొని కొత్త పాటలతో  వసంతాగమనాన్ని స్వాగతిస్తుంది.
వసంతానికి ముందున్న ప్రకృతిలాగే  నిరాశా నిస్పృహలతో నిండి, ఆశల ఆకులు రాలి మోడైన హృదయాల స్థితి-ఇక్కడ ప్రేయసీ ప్రియుల మధ్య ఏర్పడిన ఎడబాటును సూచిస్తుంది. ఇప్పుడు ఆ అపార్థాలు తొలగి వసంతంలా పరిస్థితులు చక్కబడి వారిలో  కొత్త ఆశలు చిగురించాయి. అందువలన తన తీయని ఆశలు ఫలిస్తాయని, తమ జీవితంలో రాబోయే వసంతానికి గుర్తుగా ఎలకోయిల  గొంతు సవరించుకుని మధురగీతం పాడుతోందని నాయకుడు ఊహిస్తాడు. 

 వేయిరేకులు విరిసింది జలజం
తీయతేనియ కొసరింది భ్రమరం
లోకమే ఒక ఉద్యాన వనము
లోటులేదిక మనదే సుఖము

మన మనసు చాలా చిత్రమైనది. అది ఏ పరిస్థితిలో ఉంటే మనకు అలాంటి ప్రపంచాన్నే చూపిస్తుంది.  రోజూ మనం    చూసే ప్రకృతే  మనకు ఎన్నో విధాలుగా కనిపిస్తుంది. కథానాయిక మనస్సు ప్రియుని చేరిన సంతోషంలో  ఉంది. అందుకే ఆమెకు ప్రపంచమంతా అనురాగమయమైనదిగా కనిపిస్తోంది. కొలనులో అత్యంత సహజంగా విరిసే కమలం వేయిరేకులుగా విరిసినట్టుగా తమలో విరిసే అనురాగానికి సంకేతంగా భావిస్తోంది.
ఆమె అనురాగం వేయి రేకులు విరిసిన జలజమై ఉంటే అతను పద్మం నుండి తేనెను సంగ్రహించి ఆనందించే భ్రమరమయ్యాడు. భ్రమరానికి, పద్మానికి ఉన్న సంబంధంగా ప్రేయసీ ప్రియుల, స్త్రీపురుషుల అనుబంధాన్ని వర్ణించడం మన ప్రాచీన కావ్య సంప్రదాయం. ఇక్కడ శ్రీశ్రీ గారు దాన్నే ప్రయోగించారు. వారిద్దరూ ఆవిధంగా ఉన్నప్పుడు వారు ఉంటున్న  ఈ లోకం ఓ పెద్ద ఉద్యానవనంలాగా కనిపిస్తోంది లోటులేదిక మనదే సుఖము అన్న వాక్యం -  ఇక తమకు ఏ పరిస్థితులూ అడ్డురావు  అని భావిస్తున్నారని చెప్తుంది.

చిన్ననాటి తన చిన్నారి మరదలు, ఆనాడే ముడిపడిపోయిన తమ బంధంతో భార్య కూడా అయిన  సహచరిని ఇప్పుడు సరదాగా ఆట పట్టిస్తున్నాడు ఆ బావగారైన భర్త.  సరసన కూర్చొని సరస్సులో తమ నీడలు చూసుకుంటూ చిన్ననాటి ముచ్చటలు కలబోసుకుంటూ ఉన్న ఆ తరుణంలో  ఆ బావగారు-
పగలే జాబిలి ఉదయించెనేలా అంటూ ఆమెని ప్రశ్నించాడు. జాబిలి ఉదయించేది సాయంత్రం చీకటి పడే సమయంలో కదా మరి ఈ పగటి సమయంలో ఉదయించిందేం అంటూ  అడిగిన ఆ ప్రశ్నకి ఆమెకి ఉక్రోషం కలిగింది.  తనని ఆటపట్టిస్తున్నాడనే అనుమానంతో.  వగలే చాలును పరిహాసమేలా అంటూ అతనికి జవాబు ఇచ్చింది.


తేటనీటి సరస్సు ఒడ్డున కూర్చుని ఇద్దరూ ఉండగా అతను ఒక్కసారిగా కొలను లోకి తొంగి చూసాడుట. ఆ నీటిపైన ఏర్పడిని తన ప్రేయసి ముఖబింబపు నీడ చంద్రబింబం వలె తోచిందట. పట్ట పగలు చంద్రుడు ఎలా ఉదయించాడా అని ఆశ్చర్యంతో ఉన్న తనకి అది చంద్రబింబం కాదని, తన ప్రేయసి అందాల మోము కొలనులోని తేటనీటిలో చంద్రబింబంలా ప్రకాశించి తనని భ్రమింపచేసిందని అంటాడు.  
తేటనీటను నీ నవ్వు మొగమే
తెలియాడెను నెలరేని వలెనే అంటూ తన భ్రమకి కారణం చెప్తాడు.   ప్రేయసి మరి మారాడగలదా.


జీవితాలకు నేడే వసంతం
చెదరిపోవని ప్రేమాను బంధం
ఆలపించిన ఆనంద గీతం
ఆలకించగ మధురం మధురం


 వారిజీవితాలలో ఎదురుచూస్తూ ఉన్న వసంతం ఆ విధంగా తిరిగి వచ్చింది. వాడిపోయి రాలిపోయిన ఆశలన్నీ కొత్త చివుళ్ళయి మొలకెత్తాయి. ఇరువురి జీవితాలలో ప్రేమానుబంధాలు లతలుగా పెనవేసుకున్న బంధాలయ్యాయి. 
హృదయాలు ఆలపించే మధురమైన ఆనందమయమైన గీతం గా ఇకపైన తమ జీవితం ఉండబోతోంది.  ఆ గీతాన్ని ఆలకిస్తూ ఉంటే మనసునిండా మాధుర్యం పొంగుతోంది. అదీ - ప్రస్తుతం వారి పరిస్థితి.



ఎంచక్కని  ఎంతో తేలికైన తేట తెలుగు పదాలు, పాత్రల  మానసిక స్థితికి ప్రతీకలుగా వాడుకున్న కవిసమయాలు, వాక్యాలతో చేయించే లయవిన్యాసాలు, తూగుటుయ్యాలలూగించే పద ప్రయోగాలు,  ఆది ప్రాసలు, అంత్యప్రాసలు అలంకార ప్రయోగాలు అన్నీ సమపాళ్ళలో కుదిరిన చక్కని యుగళగీతం.


 

మాంగల్యబలం చిత్రంకోసం శ్రీశ్రీ రచించిన ఈ గీతం అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటపై చిత్రీకరించబడింది.
తేటనీటను తేలియాడగల ముఖచంద్రబింబం ఆ సావిత్రిది కాక మరెవరిది??

చిత్రం :                మాంగల్యబలం 
                       (అగ్నిపరీక్ష అనే బెంగాలీ చిత్రం(1959)ఆధారంగా)
సంగీత దర్శకత్వం    మాష్టర్ వేణు
చిత్ర దర్శకుడు        ఆదుర్తి సుబ్బారావు
గాయనీ గాయకులు   ఘంటసాల, సుశీల



Tuesday, December 13, 2011

మధుర స్వాప్నిక లోకపు దారులలో షికారు చేయించే వలపులతేరు!!




పాత సినిమాలలో స్వప్న గీతాలు -  డ్రీంసాంగ్      అనేవి ప్రత్యేకంగా ఒక విభాగంగా చెప్పుకోగలిగినన్ని ఉన్నాయి. 
ప్రణయగీతాలలో ఈ స్వప్న గీతాలు ఎన్నో సందర్భాలలో మనం చూస్తాం. 

సాంఘికవ్యవస్థలో ఎన్నో కట్టుబాట్ల మధ్య ఉన్న ప్రేయసీ ప్రియుల మధ్య వారి మనసుల్లో భావాలని పంచుకోవడానికి, వారి భావిజీవితాన్ని ఊహించుకోవడానికి, వారు ఒకరికి ఒకరు సూటిగా చెప్పుకోవడానికి వీలుపడని సందర్బాలలో సినీ దర్శకులు, రచయితలు  ఆయా పాత్రల  భావాలను వారు కలలు కంటున్న దృశ్యాలుగా  చిత్రించి వాటిద్వారా పాత్ర అంతరంగాలను ఆవిష్కరించడానికే కాక, కొన్నిసార్లు  అత్యంత ప్రతిభావంతంగా కథలో మలుపుల కోసం కూడా వాడుకున్నారు. 

ఆత్రేయగారు మంచి సినిమాపాటలు రాసిన కవిగా మనకి తెలుసు. ఆయన తొలిసారిగా కవితచిత్ర బానర్ పైన వాగ్దానం అనే సినిమాకి కథ, మాటలుసమకూర్చడంతో పాటు దర్శకత్వం కూడా చేసారు.సినిమా పాటలెన్నో రాసినా తను దర్శకత్వం చేసిన సినిమాకి మాత్రం దాశరథి గారికి అవకాశం ఇచ్చి ఈ యుగళగీతాన్ని ఆత్రేయ రాయించడం ఈ పాటలో విశేషం. 
1961 అక్టోబర్ లో రిలీజయిన ఈ సినిమాతో పాటు కొద్ది రోజుల తేడాతోనే దాశరథి పాటలు రాసిన 'ఇద్దరు మిత్రులు' సినిమా వచ్చింది. 'ఖుషీ ఖుషీగా నవ్వుతూ' అనే పాటను దాశరథి తొలిపాట అని చెప్తారు కానీ రిలీజ్ పరంగా చూస్తే ముందుగా వచ్చిన పాట - నాకంటిపాపలో . అందువల్ల  తెలుగు సినిమా ప్రేక్షకులకి వందల పాటలు ఇచ్చిన గొప్ప కవిగారి తొలిపాటగా కూాడా  ఈ  పాట విశేషమే.


ప్రేమికులైన యువతీయువకులు కలలుగనే మధురమైన లోకాన్ని కవి దాశరథి ఎంత చక్కగా ఊహించి రాసారో, అంతే చక్కగా ఆ సాహిత్యానికి భావగర్భితమైన స్వరసమ్మేళనంతో పెండ్యాల, మధురమైన గానంతో ఘంటసాల, సుశీల సొబగులు అద్దారు. అంతే కాక కవి ఊహించిన లోకాన్ని ప్రేక్షకుల కనులముందు నిలిపే ఉంచే    నేపథ్య చిత్రణ తో   స్వప్నలోకాల సౌందర్యాన్ని, వెన్నెల వేళలలో పులకించే యువహృదయాలలోని మధురలాహిరిని అద్భుతంగా చిత్రించిన గీతం ఈ యుగళగీతం.  

 నా కంటి పాపలో నిలిచిపోరా
 నీ  వెంట లోకాల  గెలవనీరా.... 

తన మనసుకి నచ్చిన తను మెచ్చిన  ఆ ప్రేమికుడిని తన కంటిపాపలో నిలిచిపోమంటుంది ఆ అమ్మాయి. కంటిపాప కన్నా అపురూపమైనది ఏముంది మనిషికి.  తన మనసును దోచిన సఖుడిని కంటిపాపలాగే తన కళ్ళలో దాచుకోవాలని ఆశపడుతుంది. అందుకే  బ్రతుకులో తనకు తోడు నీడగా ఉండమని, అతనిని అంటి పెట్టుకుని ఉంటే లోకాలని గెలవగలనని కలలు కంటుంది.

ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో 
జాబిలి వెలిగేను మనకోసమే

ఇప్పుడు తాము చూస్తున్న ఈ పున్నమి వెలుగుల కాంతి ఆ వెన్నెలను తామిద్దరూ కలిసి మరల అనుభవించగలగడం సామాన్యమయిన విషయం కాదని, అది ఏనాటి జన్మ జన్మాలలోనో చేసుకున్న పుణ్యం  వలన కలిగిన ఫలితమని ఊహిస్తుంది ఆ అమ్మాయి. అద్భుతమైన సౌందర్యంతో వెలిగిపోతున్న ఆ జాబిలి  తమ ఇద్దరి కోసమే వెలుగుతోందని అంటుంది.
నెయ్యాలలో తలపుటుయ్యాలలో
 అందుకుందాము అందని ఆకాశమే - అంటాడు అబ్బాయి. తమ ఇరువురి స్నేహంలో ఒకరి గురించి ఒకరు కలలుగంటూ,  తలపులు మనసులను ఉయ్యాలలాగా ఊపుతూ ఉంటే అందదు అనుకునే ఆ ఆకాశాన్ని కూడా అందుకుని  ఆనందించవచ్చునంటాడు.  

తమకోసమే వెలుగుతోందేమో ఈ చందమామ- అంటూ  అమ్మాయి చూపిస్తున్న చందమామ,  అబ్బాయిని కూడా ఊరిస్తుంది. ఆ చందమామ ఎంతో అందంగా వెలుగుతోంది. చందమామ కురిపిస్తున్న వెన్నెల ప్రవాహంలా ఆకాశంనుంచి జాలువారుతోంది. ఏకంగా ఆ చందమామ లోకంలోకే వెళ్ళి ఆ వెన్నెల్లోనే స్నానంచేసి వస్తేనో అనే కమ్మని భావం కలిగింది అతనికి.  అందుకే -


ఆచందమామలో ఆనంద సీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా అని అడుగుతాడు. 

మేఘాలలో - వలపు రాగాలలో 
దూరదూరాల స్వర్గాల చేరుదమా  
చందమామ సీమలో చేరడానికి  స్వర్గాలను అందుకోవడానికి వారు వెళ్ళవలసిన దారి మేఘాలదారి. వలపురాగాల తేరులో ప్రయాణం చేసి అందుకోలేని స్వర్గసీమలకు ప్రయాణం చెయ్యాలి. దూరదూరంగా అనిపించే స్వర్గం ఆ దారిలో వెళ్ళినవారికి ఎంతో దగ్గరవుతుంది  మరి.


అలా ప్రయాణం చేసే దారి ఎలా ఉంటుందంటే అది ఓ పూలదారి. స్వర్గలోకానికి చేరే దారి పూలతో పరిచిన మెత్తటి బాటలే.  ఆ పూలదారిపైన ప్రయాణం చేస్తూ ఉంటే ఆ నీలిగగనాన కనిపించే ప్రకాశించే తారలు తమను పలకరిస్తూ, తమ కనులలో మెరిసే స్వప్నాలను ప్రతిఫలిస్తూ ఉంటే ఆ ప్రయాణం ఓ మధురమైన అనుభూతి.

ఈ పూలదారులు, ఆ నీలి తారలు 
తీయని స్వప్నాల తేలించగా

అంటూ  తాము అందుకోబోయే స్వర్గలోకాల ప్రయాణాన్ని ఊహిస్తుంది అమ్మాయి.


అందాలను తీపి బంధాలను 
అల్లుకుందాము డెందాలు పాలించగా.

ప్రేయసి తన అందాలతోను, మమతానురాగాలతోను వేసిన తీపి బంధాలను ఇష్టంగా తనచుట్టూ తానే పెనవేసుకుంటాడు అబ్బాయి.  ఆ బంధం పట్ల తనకి ఉన్న ఇష్టాన్ని  ప్రకటించే పదం ఆ తీపి బంధం.
ఆ మమతల బంధాలే ఇక తమ డెందాలు (హృదయాల)ను పాలించే అధికారులు. ఆమె సౌందర్యం, అనురాగం తన జీవితాన్ని శాసించాలని ఆ ప్రేమబంధంలో తాను ఇమిడిపోవాలని భావిస్తాడు అబ్బాయి.

ఈ పాటలో దాశరథి సాహిత్యం - ఎంతో చక్కని  భావ చిత్రాలను శ్రోతల మనసులో  చిత్రిస్తుంది. 


"ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో(పున్నెమో- పుణ్యముకి వికృతి పదం)" అంటూ చేసిన పదచమత్కృతి ఎంతో మధురంగా ఉంటుంది.  

వివాహ కార్యక్రమానికి సిద్ధం చేసే వేళ యువతీయువకులకి మంగళ స్నానాలు చేయిస్తారు. వారిని ఒకటిగా చేసే మంగళ కార్యక్రమంలో తొలి ఘట్టం అది. ఈ మంగళ స్నానాలు అనే కార్యక్రమానికి పర్యాయపదంగా దాశరథి ఉపయోగించిన ఈ వెన్నెల స్నానాలు మాట ఎంతో అద్భుతంగా ఉంటుంది.

అలాగే  నెయ్యాలు అనేమాట దానికి తూగు కలిగించేలా  తలపుటుయ్యాల అని వాడడంలో  కేవలం ప్రాస మాత్రమే కాక, ఆ ఉయ్యాల అనే పదం వాడడం వలన అందని ఆకాశాలు అందుకోవడం కోసం ఊగే ఉయ్యాలలోని ఊపును కూడా చూస్తాం.

మేఘాలలో,  వలపు రాగాలలో,  దూరతీరాల స్వర్గాలు,  పూలదారులు, నీలితారలు, స్వప్నాలు వంటి పదాలలో  లకారం,   అందాలు, తీపి బంధాలు, అల్లుకుందాము, డెందాలు పదాలలోని ద కారం పదే పదే రావడంలో పాటకి ఒక తూగు లయ ఏర్పడి  పాట వినడానికి  ఎంతో హాయి గొలుపుతుంది.


చందమామలోని చల్లదనాన్ని, చల్లగాలి కలిగించే పారవశ్యాన్ని  ఆ మత్తులో ఊగే పూలతీగెలని,  మేనుకి వెన్నెల సోనలు కలిగించే చల్లదనాన్ని, అదే వెన్నెల  వలచిన హృదయాలలో కలిగించే వెచ్చదనాన్ని ఇంకా మాటలలో చెప్పలేని మధురమైన హాయిని కలిగిస్తూ  మబ్బుల తేరులో కూర్చోబెట్టి  పూలదారులలో  వెన్నెల విహారాలు చేయించి  కళ్ళముందు ఓ అద్భుతమైన ప్రణయసీమను ఆవిష్కరిస్తుంది.....ఈ  యుగళగీతం!!



చిత్రం పేరు  వాగ్దానం
 
గీత రచయిత            దాశరథి
సంగీతం                  పెండ్యాల నాగేశ్వరరావు
చిత్ర దర్శకులు           ఆచార్య ఆత్రేయ
గీత గానం                 ఘంటసాల, సుశీల

చలనచిత్రంలో ఈ పాటని అభినయించిన ప్రేమికుల జంట కృష్ణకుమారి, అక్కినేని నాగేశ్వరరావు.