Sunday, November 27, 2011

చల్లనిగాలి ....చక్కని తోట...మనసుకు హత్తుకునే ఈ పాట!!

చల్లని తోటలో విహరిస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ప్రేయసీప్రియులు పాడుకునే చక్కని యుగళగీతం....
"చల్లనిగాలి చక్కని తోట....." పాట.


ప్రణయజీవులైన యువతీయువకులు ఏకాంతాన్ని కోరుకుంటారు. ఎదసొదలను ఒకరికొకరు వినిపించుకోవడానికి  ఆ  ఏకాంతానికి అనువైన చోటును వెతుక్కుంటారు.  చల్లని గాలి వీచే వేళ,  అతి చక్కని పచ్చని ప్రకృతి పరవశింపచేస్తూ ఉంటే  ఆసమయంలో ఒకరితో ఒకరు ఊసులు కలబోసుకునే అవకాశం దొరికితే,   ఇక అంతకన్నా వాళ్ళకి  కావలసినదేమిటి?!!.


మనసుకు నచ్చే చోట
నచ్చిన మనిషితో  మాట
పాటగా పల్లవిస్తే  అది ఆరుద్ర కలం నుండి వెలువడి, ఘంటసాల - సుశీల అమృతగళాల మీదుగా జారువారి తేనెలవూటగా మారితే  ఈపాట.


చల్లనిగాలి చక్కని తోట 
పక్కన నీవుంటే పరవశమే కాదా


అంటూ ప్రేయసి  తన మనసు మెచ్చినవాడు పక్కన ఉండండం వల్ల చల్లగా వీస్తున్న గాలి, కనువిందుగా ముచ్చటగొలుపుతున్న తోట  పరవశం కలిగిస్తున్నాయిని అంటుంది.


ఆమె ప్రకృతి తనను మైమరపింపజేస్తున్న విషయాన్ని, అతని సాన్నిధ్యంలో తన మనసుకు కలిగే సంతోషాన్ని  గురించి చెప్తూ ఉంటే ప్రియుడు మాత్రం దానిని గమనించకుండా  తమ ఏకాంతాన్ని, ఆ సమయంలో ఆమె సౌందర్యాన్ని మాత్రమే చూస్తున్నాడు. ఆమె అందమైన కళ్ళతో, అనురాగం నిండిన చూపులతో తనను బంధిస్తోందని భావిస్తాడు. అందుకే


అందాల నీ ఓరచూపులు
నను బంధించు బంగారు గొలుసులు 


అంటాడు.  కానీ ఆమె మాత్రం తనను మైమరపిస్తున్న ప్రకృతి దృశ్యాల సౌందర్యం తనలో కలిగిస్తున్న మోహం నుంచి బయటపడలేదు.  తను చూస్తున్న, తనను చూస్తున్న అతని చూపులలో కూడా
ఆమెకి ప్రకృతే కనిపిస్తోంది. తనని చూస్తూ,  ఆనందిస్తున్న అతని ముఖంలోని చిరునవ్వులు ఆమెకి ఆకాశంలో వెలిగే జిలుగు  జాబిలిని తలపించాయి. జాబిలిని చూడగానే కలువలు వికసించడం ప్రకృతి సహజమయిన విషయం. మన కవిసమయం కూడా. అందుకే అతని చిరునవ్వులు అనే చంద్రకిరణాలు సోకిన వెంటనే ఆమెలోని ప్రణయ భావం అనే కలువలు వికసిస్తున్నాయంటూ ఇలా అంటుంది.


నీ చిరునవ్వులే జాబిలి రేకలు
వికసించెను నా వలపుల లేతలపుల కలువలు 


 అతని చూపులు జాబిలిరేకలు(చంద్రకిరణాలు)లా తనను  తాకిన వెంటనే, తన మనసులో వలపులతో కూడిన లేత తలపులనే కలువలు  వికసించాయని  ఆమెతో చెప్పించి  ఎంతో చక్కని  తేటతెలుగు పదాలతో సరసహృదయాలను గిలిగింతలు పెడతారు ఆరుద్ర.


ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్న ఆమె ఒక్కసారిగా తన స్థితిని తెలుసుకుంటుంది. బాహ్య స్మృతి కలిగినట్టుగా  ప్రకృతి తనపై కలిగించిన ప్రభావం నుంచి తేరుకుంటుంది. వెంటనే ఈ హాయి కేవలం తాత్కాలికమేనేమో, అతను తనను విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమోనని బెంగ పడుతుంది. అందుకే


ఈరేయి  ఈ హాయి మరువకు
నా చేయి ఏనాడు విడువకు 


అంటూ వాగ్దానం చేయమని కోరుతుంది. ఈ రేయి తనలో కలిగించిన హాయి, అతను కూడా అనుభవిస్తున్నాడు. అందుకే ఈ రేయిని, తమ సాన్నిధ్యంలో పొందిన ఈ హాయిని ఏనాడు మరచిపోవద్దని, తన చేయిని విడిచి పెట్టి వెళ్ళవద్దని మరోసారి గుర్తుచేస్తుంది.


 ప్రేయసి వాగ్దానం  అడిగితే అతను నిన్ను  ఎప్పుడూ విడిచిపెట్టనూ అనో, నీవే నా ప్రాణం అనో అనకుండా  ఇలా అంటాడు.


నా అనురాగమే కమ్మని తుమ్మెద
నను పిలిచెను మరపించెను నీ సొగసుల పూలు 


తన ప్రేయసి సొగసు అంతా పూలుగా విరబూసి  తనను ఆహ్వానిస్తూ ఉంటే  తన అనురాగమనే తుమ్మెద ఆమె సొగసు చుట్టూ తిరుగుతూనే ఉంటుందంటాడు.  స్త్రీ సౌందర్యాన్ని అతి సుకుమారమైన పూలతో పోల్చడం,  అందంగా వికసించిన  పూలలోని మాధుర్యంకోసం,  పూలను అంటిపెట్టుకుని  తుమ్మెదలు తిరగడం ఇది ప్రకృతి సహజమైన విషయం. స్త్రీ  సౌందర్యాన్ని అతి సుకుమారమైన పూలతో పోల్చడం  అనేది  కవి సమయం కూడా.


ఇక్కడ ప్రేయసి సొగసును  సుకుమారమైన పూలలోని మాధుర్యంగాను, ఆ పూలను ఆశించి వాటిచుట్టూ తిరిగే తుమ్మెదలను తన అనురాగంగా భావించడం, తద్వారా  పూలమాధుర్యాన్ని తుమ్మెదలు ఎప్పుడూ విడిచి ఉండలేని చందంగా తను కూడా ఆమెని విడిచి వెళ్ళలేనని  ప్రియుడితో చెప్పించడం ద్వారా  ఈ చరణంలో ఎంతో అపురూపమైన భావాన్ని   చమత్కారంగా  వెల్లడించారు కవి.


పాట పూర్తయిన వెంటనే మనం మెచ్చిన, మనసుకు నచ్చిన వారితో కలిసి  ఒంటిని హాయిగా గిలిగింతలు పెట్టే  గాలితెమ్మెరలతో, పూల పరిమళాలను ఆస్వాదిస్తూ,  హాయిని అనుభవిస్తూ ఇంచక్కా ఓ చక్కని తోటలో విహరించి వచ్చిన అనుభూతి మన స్వంతమవుతుంది.


అతి చిన్న వాక్యాలతో కూడిన రెండు చరణాలతో,  అతి తేలికైన  తేట తెలుగు మాటలతో  భావకవుల ఊహలలోని నాజూకుతనాన్ని నింపి  ఈ పాటను  వీనులకు పసందు మీరగా విందుచేసారు ఆరుద్ర.. సంగీత దర్శకుడు మాష్టర్ వేణు దీనిని ఎంతో చక్కగా స్వరపరిచారు.
పెళ్ళికాని పిల్లలు     చిత్రం కోసం కాంతారావు, రాజశ్రీ జంటపైన ఈ పాట చిత్రించబడింది.












Wednesday, November 23, 2011

శ్రీవారి పరాకు -శ్రీమతి చిరాకు

శ్రీవారి పరాకు - శ్రీమతి చిరాకు

ప్రణయభావం  అంటే ఉధృతంగా పడిలేచే ఓ కడలి తరంగం లాంటిది. ఒకసారి ఆ  భావతరంగం తాకిడిని  తట్టుకోలేక పోయామో దానితో పాటు ఆ ప్రేమకడలిలో మునిగి మునకలు వేసి తీరవలసిందే. కోపాలు, అలకలు, మురిపాలు, ముచ్చట్లు, విసుగులు ఇన్నిరకాలుగా వచ్చిపడే అలల తాకిడిని తట్టుకుంటూ ఆ ప్రేమసముద్రాన్ని తరించవలసిందే.

 రసపట్టులో తర్కం కూడదంటాడు మాయాబజారు కృష్ణుడు. అందులోని తర్కాన్ని గుర్తించిన ఓ  భర్త  సమయానుకూలంగా స్పందించి రసభంగం కానీయకుండా ఎలా ప్రవర్తించాడో, ఈ పాటలో చూపించారు మనకు - ఆరుద్ర.   

ముఖ్యంగా  అతి సున్నితమయిన మనసులతో ముడిపడిన ప్రణయఘట్టాలలో పట్టువిడుపులను సమయానుకూలంగా తెలుసుకొని నడుచుకోకపోతే  అది  పీటముడిగా బిగుసుకుంటుంది. భార్యాభర్తలు సంసారజీవితంలో ఈ సూత్రాన్ని తెలుసుకోగలిగితే వైవాహిక జీవితం స్వర్గమే.

భర్త తనమీద మునుపటిలా శ్రద్ధ చూపించకపోవడం, తాను చెంతకు చేరినా ఆసక్తి చూపించకపోవడం,  పైగా పరాకు చిత్తగించడం ఇవన్నీ భార్యలకు కోపం తెప్పించే లక్షణాలే. నిజానికి అలిగి మూడంకె వేసుకుని ముడుచుకుని పడుకొని తన కోపాన్ని చూపించవలసిన సందర్భమే. కానీ భర్తది రివర్స్ గేర్ లో వెళ్తున్న బండి అని గుర్తించింది భార్య. అందుకే తానూ  గేర్ మార్చింది.

 నేడు శ్రీవారికి మేమంటే పరాకా
తగని భలే చిరాకా.....ఎందుకో తగని భలే చిరాకా...

అంటూ శ్రీవారి చికాకును, పరాకును తాను పసిగట్టానని కారణం చెప్పమంటూ అడుగుతుంది.

ప్రియురాలు అలిగితే   ప్రియుడు గ్రహించి అలక తీర్చాలి. అది ప్రేమ సంప్రదాయం. పెళ్ళికి ముందు ఈ అలకలు బహు ముచ్చటగాను, పసందుగాను ఉంటాయి. కానీ పెళ్ళి అనే ముచ్చట తీరిన తరువాత ప్రియురాలు భార్యగా మారాక  ఆ భార్య అలిగితే  మునుపటిలా చిలకలకొలికి గా, వలపుల మొలకగా కనిపించదు కాబోలు. ఆ అలకకి ఆ ప్రియుడైన  భర్త మునుపటిలా  అదరడూ బెదరడూ.  అంతే కాక ఆ విషయం గ్రహించనట్టు పరాకు చిత్తగిస్తాడు. భర్తగారితో కాపురంలో ఆ విషయాన్ని గ్రహించింది. కనుకనే ఇలా అంటుంది.

మొదట మగవారు వేస్తారు వేషాలు
పెళ్ళి కాగానే చేస్తారు మోసం

అంటూ  పెళ్ళికిముందు తనపై  ఎంతో ప్రేమ ఉన్నట్టు,  తనపైన  కోపతాపాలను భరించలేనట్టు అతను వేసినవన్నీ వేషాలేనని,  అప్పటి అతని ప్రవర్తన అంతా మోసమేనని తెలుసుకున్నానంటుంది.

అంతవరకూ  శ్రీమతి పై పరాకు చిత్తగిస్తున్న ప్రియభర్తగారికి ఒక్కసారిగా ఈ మాటలు తాకుతాయి.
తనను మోసగాడిగా భార్య చిత్రిస్తున్న మాటలకు మరికాస్త కోపం వస్తుంది కాబోలు...

ఆడవారంటే శాంత స్వరూపాలే.....
కోప తాపాలు రావండి పాపం

అంటూ కోపాలు, అలకలు వంటి ఏ చిన్నెలూ లేని అపర శాంతమూర్తులు కదూ మీ ఆడవాళ్ళు అంటూ వ్యంగ్యగా ఓ వాగ్బాణం విసురుతాడు.

ఆ బాణం ఎక్కడ తగలాలో అక్కడ తగిలిన భార్యామణి వెంటనే మూతి ముడుచుకుంటుంది.  తాను అంతగా  అతనిని  ప్రేమించడం వల్లనే కదా ఇంత చులకన అయిపోయాను అనే భావంతో అభిమానం గాయపడుతుంది.

కోరి చేరిన మనసు చేత జిక్కిన అలుసు
కొసకు  ఎడబాటు అలవాటు చేస్తారు 

భార్యగా  తనెంతో ప్రేమగా  దగ్గరకు చేరితే, ఇలా వ్యంగ్యంగా మాట్లాడి తన ప్రేమను చులకన చేసి, చివరకు అతనికి దూరంగా ఉండడమే మేలేమో అనిపిస్తారు ఈ భర్తలు  అంటూ-
 మగవారు తమకే తెలిసో తెలియకో  ప్రేమించే మనసును అవమాన పరిస్తే  కలిగే బాధను అతనికి తెలియజెప్పింది.

తన నిర్లక్ష్యం, తన పరాకు ధోరణి శ్రీమతిలో కలిగిస్తున్న బాధ ఆమె మాటలలో తెలుసుకున్నాడు భర్త.  కానీ అంతలోనే రాజీకొచ్చేస్తే మళ్ళీ శ్రీమతి దృష్టిలో  తాను పలచబడిపోతానేమోననే భయం ఉంది కనుకనే-

నేడు శ్రీమతికి మాతోటి వివాదం
తగువే భలే వినోదం...

అంటూ  శ్రీమతిగారు తనతో వివాదం పెట్టుకోవడానికే తనపై పరాకు నిందవేస్తోందని ముందరి కాళ్ళకు బంధాలు వేసాడు. తనతో వివాదాలు ఆమెకి వినోదాలు కలిగిస్తాయని అందుకే ఆమె ఏదో విధంగా తగవు పెట్టుకునే ప్రయత్నంలో ఉందనీ తన తప్పేం లేదని తప్పుకోజూస్తాడు.
అంతేకాదు.-

వారి మనసైతే వస్తారు ఆడవారు
చేర రమ్మంటే రానేరారూ

అంటూ ఆడవారి మనస్తత్వాన్ని  చెప్తూ తమ సహవాసం ద్వారా తాను గ్రహించిన ఓ గొప్ప సత్యాన్ని కూడా వివరిస్తాడు.తనకు ఆడవారి గురించి బాగా తెలుసు అంటూ వారి తీరును పరిహాసంగా విమర్శిస్తాడు.

తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు
తెలిసి తీర్చారు ముద్దూ మురిపాలు

మరి  మాటల మిటారి. మహా జాణ. ఆమె ఊరుకుంటుందా.  భర్తగారు ఎంతో గర్వంగా తాను గమనించానని చెప్తున్న విషయాన్ని  ఎత్తిపొడిచింది.

"ఆడవారి మనస్తత్వాన్ని ఎంతో చక్కగా గ్రహించారు మీరు"  అని పొగుడుతూనే  "తెలిసి తీర్చారు ముద్దూ మురిపాలు " అంటూ నిజంగా అతను ఆడవారి మనసును గ్రహించే శక్తి ఉన్న వాడయితే ఇలా తన మనసును గ్రహించకుండా ప్రవర్తించి తనను బాధ పెట్టడు కదా అన్న వ్యంగ్యాన్ని ఆ మాటలలో పొదిగి మరో అస్త్రాన్ని వదిలింది.

ఇక  ఈ పాటికి శ్రీవారికి అర్థమయింది. కథ శృతిమించి రాగాన పడనున్నదని. రాజీకి రాక పోతే వ్యవహారం చాలా ముదరబోతోందని.
అందుకే మొత్తం వ్యవహారం అంతా తమాషాగా జరిగిన సాధారణమైన విషయమేనంటూ-

అలుక సరదా మీకూ
అదే వేడుక మాకూ
కడకు మురిపించి గెలిచేది మీరేలే

అంటూ స్త్రీలు అలగడం అనేది   ప్రేమ వ్యవహారంలో  ఓ సరదా యైన, వేడుకైన ఘట్టం అని, దానిని మగవారు ఎంతో ఆనందంగా వీక్షించి పరవశిస్తామని చెప్తూ భార్యతో రాజీని ప్రతిపాదిస్తాడు.

ప్రణయ కలహాల సరసాలే వినోదం
నిజమే భలే వినోదం

అంటూ భార్య కూడా భర్త అభిప్రాయానికి వంత పాడుతుంది. 
తమ ప్రేమసముద్రంలో లేచిన ప్రణయకలహమనే  ఓ చిరు కెరటం చేసిన సందడిని  భార్యా భర్తలిద్దరూ మురిపెంగా ఆస్వాదించడంతో పాట ముగుస్తుంది.

ప్రణయబంధంతో ముడివేసుకున్న పరిణయబంధం పటిష్టంగా ఉండాలంటే అందుకు భార్యాభర్తలిద్దరూ పరస్పరం స్నేహబంధంతో ఆత్మీయతతో ఉండాలి. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అనే భావం పొడసూపిందో ఆ సంసారంలో ఒడిదుడుకులు తప్పవు. ప్రణయకలహాలు ప్రేమదీపం కలకాలం వెలగడానికి తోడ్పడే తైలం కావాలి కానీ భగ్గున మండించి మసిచేసే ఆజ్యం కాకూడదు.

ఈ పాటలో మనకు వినిపించే ప్రబోధం అదే.




 ఈ పాట ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన   ఇల్లరికం చిత్రంలోనిది.
వెండి తెరపైన అక్కినేని నాగేశ్వరరావు, జమున జంట పై చిత్రించబడిన ప్రణయగీతం ఇది.

పాట రచన - ఆరుద్ర గా ప్రసిద్ధిపొందిన సినీకవి (భాగవతుల సదాశివ శంకరశాస్త్రి) 
సంగీత రచన  టి. చలపతిరావు
చిత్ర దర్శకులు తాతినేని ప్రకాశరావు.
ఈ పాటను అత్యంత భావగర్భితంగా గానం చేసిన గాయనీ గాయకులు - ఘంటసాల, పి. సుశీల.